షోడశి రామాయణ రహస్యములు
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com/జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
భార్య / జానకి
పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
కవి విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
-----------
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.comwww.facebook.com/shodasi/
---------
www.facebook.com/shodasi/
డా. అద్దంకి శ్రీనివాస్,
కవి , విమర్శకులు
విమర్శలో కుండలినీశక్తి లాంటివాడు శేషేంద్ర. ఆయనలోని అఖండశేముషీ ధురీణతను పట్టిచూపేవి ఆయన విమర్శగ్రంథాలే. అందులో షోడశి తలమానికం.
శేషేంద్రను కవిగా అంచనా వేయడం ఒక ఎత్తయితే పండితవిమర్శకుడిగా అంచనా వేయడం మరో ఎత్తు. శేషేంద్ర కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సహృదయత ఉంటే చాలు. కానీ శేషేంద్ర విమర్శలోని లోతులను అర్థం చేసుకోవాలంటే ప్రతిభతో పాటూ వ్యుత్పత్తి అభ్యాసాలూ మెండుగా పండాలి. శేషేంద్ర వాల్మీకిని శ్వాసించాడు. కవితా ప్రస్థానం కూడా వాల్మీకిలో కలిగినవిధంగానే కలిగింది (చండాలోపి మమ గురుః). ఆ తరువాత పురాణేతిహాస అనువాద వారసత్వం సోహ్రాబ్ రుస్తుం. వాల్మీకి (ఇతర కవుల) కవిత్వవిద్యను సాధారణ పాఠకుడిగానో భక్తుడుగానో పండితుడిగానో చదువుకొని ఆపేస్తే ఎందరో పండితుల్లాగా శేషేంద్ర కూడా అక్కడితో ఆగిపోయేవాడు. శేషేంద్రది ప్రతిభావిమర్శ, ఇంకా చెప్పాలంటే శేషేంద్రవిమర్శ. అదే ఆయా కవుల కవిత్వంలోని శాస్త్ర రహస్యాలను అన్వేషించేటట్టు చేసింది. ఇక వాల్మీకినైతే శేషేంద్ర దర్శించినట్లు మరెవ్వరూ దర్శించలేదు. శేషేంద్రకు వాల్మీకిదర్శనం అయ్యింది. శేషేంద్ర వాల్మీకికి శిష్యుడు, భక్తుడు. ఆ భక్తి వేరు.
విశ్వదృశ్యంనుంచి తాత్పర్యం పిండిన దివ్యపదార్థం రామాయణంలో ఉంది. దానిని విమర్శద్వారా పట్టి చూపాడు శేషేంద్ర. ఇది ప్రతి కావ్యం విషయంలోనూ జరగాలి అని శేషేంద్ర కల. దానికి సాకారమే కవిసేన మేనిఫెస్టో. కవిత్వంలో విలువల్నిగానీ వస్తురూపాల్లాంటి కావ్య సామాగ్రిని గానీ కవి ఆలోచనలే నిర్దేశిస్తాయని కవిసేన మేనిఫెస్టోలో చేసిన లక్షణానికి శేషేంద్ర కావ్యాలు లక్ష్యాలయితే దానికి మూలాలు రామాయణంలోనివే. వాల్మీకిని శేషేంద్ర చూసిందీ ఈ కోణంనుంచే. అందుకే శేషేంద్ర కవిత్వమూ సాహిత్యవిమర్శ వేరు కాదు అనేది. కవిత్వంలో చూపాల్సిన ప్రతిభను విమర్శలోనూ విమర్శలో చూపాల్సిన వ్యుత్పత్తిని కవిత్వంలోనూ జంటగా నడిపిన నేర్పు శేషేంద్రది. అంతర్లీనంగా కవులలో ఉండే అభ్యుదయాగ్నినీ, ఒకానొక కవనార్తినీ విమర్శకుడిగా జీర్ణించుకొన్న శేషేంద్ర నివురు కప్పిన నిప్పులా వెలిగిపోయాడు. రగిలిపోయాడు. సంస్కృత ఆంధ్ర కావ్యాలపై చేసిన పరిశోధనలు రెండూ శేషేంద్రకు రెండు కళ్ళయితే వాల్మీకిరామాయణం మాత్రం మూడో కన్ను.
భాగవతాన్ని అర్థం చేసుకోవాలంటే భక్తి ఒక్కటీ చాలు అన్నారు. భారతానికి భక్తీ యుక్తీ కావాలన్నారు. అదనంగా వ్యుత్పత్తీ కావాలట. ఇది ఎంత వాస్తవమో శేషేంద్రవిమర్శ అర్థం కావడానికి ప్రతిభ, వ్యత్పత్తి, అభ్యాసాలూ వాటితో పాటుగా వివిధ శాస్త్రాంశాలతో కంఠదఘ్నపాండితీగరిమ కూడా ఉండాలన్నది అంతే వాస్తవం. శేషేంద్రకి పాశ్యాత్యసాహిత్యదృక్పథం శరీరం. భారతీయ అంలంకారశాస్త్రం ఆత్మ. వీటి సమన్వయం శేషేంద్ర ప్రతిభ. సాధారణంగా కవిత్వానికి వ్యాఖ్యానం కావాలి. విమర్శవ్యాసాలకు అవసరం ఉండదు. కానీ శేషేంద్ర విషయంలో ఇది వ్యతిరిక్తం.
శేషేంద్ర సాహిత్యపు లోతుల్ని ఆవిష్కరింపజేసిన తాత్త్వికవిమర్శకుడు. లౌకికసత్యాలను వేదపరంగా సమన్వయించే శేషేంద్రగారి విమర్శనాన్వేషణ ఒక చెట్టు అయితే ఆయన కవిత్వం జీవతత్త్వం ప్రతిఫలించిన ఫలం. అందుకే విమర్శశిఖరాలపై కవిత్వదీపాలు వెలిగించిన క్రాంతదర్శి. ఈ నేపథ్యంలోంచి పురుడుపోసుకొన్నదే ఆధునిక మహాభారతం. ఇది ఆధునిక సాహిత్యంలో కావ్యేతిహాసాలు లేనిలోటు తీర్చింది. వేలసంవత్సరాలుగా సాగిన సాహిత్యకళ ప్రస్థానంలోని అన్ని దశలూ దిశలూ సారభూతంగా ఘనీభవించి అక్షరాకృతిని దాలిస్తే ఒక ఆధునిక మహాభారతం అవుతుంది. కొన్ని కొత్త సాహిత్యప్రయోజనాలు అవతరించవలసిన సంధికాలంలో సామాజిక చైతన్యాన్ని సాహిత్యగతం చేయటంకోసం శేషేంద్రశర్మ వచనకవితావాహికను ఎంచుకొన్నారు. అలా అని కావ్యత్వానికి భంగం వాటిల్లనివ్వని వ్యూహం శేషేంద్రది. ఇది విమర్శరంగం సృజనలో ప్రతిఫలించడానికి నిదర్శనం. అంతకు ముందు తెలుగులో వచనకవిత్వప్రక్రియ ఉంది. దానిది పాశ్చాత్యభూమిక. కానీ శేషేంద్ర వచనకవిత్వం పాశ్యాత్య రూపం, ప్రాచీన భారతీయకావ్యశాస్త్ర అంతరంగం కలది. అందుకే వర్తమాన కవిత్వంలో ఇతిహాసం ఒక అచుంబిత ప్రక్రియగా గుర్తించాడు. దీనికి ఇతివృత్తం ఉండదు. కానీ మానవసంఘర్షణనే ఆంతరిక ఇతివృత్తంగా గ్రహించి శేషేంద్ర వస్త్వైక్యం సాధించాడు. ఇది ఆధునిక కవిత్వానికి కొత్త దారి తెరిచిన దార్శనికతే కాదు విమర్శలోకానికి అంతుచిక్కని అనర్ఘరత్నం. పాశ్చాత్యదేశాల్లోనూ అప్పట్లో ఇటువంటి కావ్యాలే వస్తున్నాయి. అంతస్సూత్రం ఆధునిక మానవుడి సర్వతోముఖ అభ్యుదయకాంక్ష. మహాభారతంలాగా అంతుచిక్కని చిక్కని రహస్యాలను ఆవిష్కరించడమే దీని లక్ష్యం. పది పర్వాల బృహత్కావ్యం. శేషేంద్ర ఆత్మకు సమగ్రస్వరూపం. కవితా విశ్వరూపం. ఇందులో పర్వశబ్దాన్ని సార్థకంగానే విమర్శమూలాలను తాకిన వ్యక్తి కాబట్టే వాడగలిగారు. పర్వశబ్దం అగ్ని త్రయీ వేదానికి సంబంధించినది. భారతం అగ్ని విద్య కాబట్టి ఇందులోని భాగాలకు పర్వాలని పేరు. పర్వం అంటే గ్రంథి. రస బలాల గ్రంథి బంధనమే సృష్టి. రసబలాల తారతమ్యాలను బట్టి జీవసృష్టిలో వివిధగ్రంథులు ఏర్పడతాయి. ప్రతిగ్రంథిలోనూ రసం ఉంటుంది కాబట్టి భారతం ప్రతిపర్వ రసోదయం. 18 పర్వాలూ జీవితానికి అన్వయిస్తాయి. మానవ జీవితమే మహాభారతం. పైగా మహా భారతంలో నరుడే నాయకుడు. ధర్మరాజాదులు అతడి ప్రవృత్తులే. సాహిత్యంలో సామాన్యనరుడు నాయకుడైతే శేషేంద్ర గీతాచార్యుడు. ఏదైనా ఒక ఆర్షకావ్యాన్ని సాధారణంగా కాక ఇలా తాత్త్వికంగా ఆలోచించాలనే ఆలోచనలకు ఊపిరులూదిన వాడు సకాలీన సాహిత్యప్రపంచంలో శేషేంద్ర ఒక్కడే. ఆ ఆలోచనకు పరాకాష్ఠ షోడసి రామాయణ రహస్యాలు. కవిత సామాన్య జనులలోనికి కూడా ప్రవహించాలి. అందుకు విమర్శ తోడ్పడాలి. ఇదే శేషేంద్ర సాహిత్యప్రస్థానానికి పరమావధి.
కవిత్వంలోనైనా విమర్శలోనైనా విపరీతమైన కసిని పెంచుకొన్నవ్యక్తి శేషేంద్ర. ఆ కసిని అసిగా మార్చుకోవడమూ ఆయనకే చెల్లింది. విమర్శన పటిమకు, లోకోత్తర నిపుణతకు అప్పటివరకూ ఉన్న కాలం చెల్లిన రేఖల్ని తుడిచివేసి కొత్త రేఖ దిద్దిన విమర్శగ్రంథం 'కాలరేఖ'. వాల్మీకి, వ్యాస, కాళిదాస, మయూరాది సంస్కృతకవుల హృదయాలను అత్యంత నైపుణ్యంతో కొత్తగా ఆవిష్కరించిన విమర్శగ్రంథం . నిర్మలనైషధమందాకినీవీచికలలో ప్రతిభావ్యుత్పత్తులను రెక్కలుగా తొడుక్కొన్ని ఓలలాడి, అప్పటివరకూ నీరమే ననుకొంటున్న సాపితీలోకానికి హర్షకవిత్వక్షీరమాధురిని వేరుచేసి చూపించిన స్వర్ణహంస శేషేంద్ర. నైషధం ప్రౌఢమైనదని అందరూ చెప్పారు. శేషేంద్ర శ్రీహర్షుడిది శాంకర సంప్రదాయమని నిరూపించి మంత్ర, యోగ, వేదాంతాలకు అన్యటించాడు. నలుడు జీవాత్మ. భీముడు పరమాత్మ (నిర్గుణ బ్రహ్మము) దమయంతి శ్రీమహాత్రిపురసుందరి. ఇది శేషేంద్ర నిరూపణ. దీనికి ఉపనిషద్వాక్యాలను ఉట్టంకిస్తూ సమర్థించటం శేషేంద్ర పాండితీవైభవానికి పరాకాష్ఠ. ఇవన్నీ క్శీరధారలే. తాగి అరిగించుకోవడం మాన్యలకు తప్ప సామాన్యులకు అయ్యేపని కాదు.
షోడశి అంటే శ్రీవిద్య. ఇది మహాతంత్రాత్మకం. మంత్ర యోగవిద్యలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు రామాయణంలో ఉన్నాయని సోపపత్తికంగా మొట్టమొదట షోడశి - రామాయణ రహస్యాలు (1967) గ్రంథంలో శేషేంద్ర నిరూపించారని విశ్వనాథ సత్యనారాయణగారి మెచ్చుకోలు. కుండలినీ విద్యా ప్రబోధకమైనందువల్లనే సుందరాకాండకు ఆపేరు. సీతరూపంలో ఉన్న శక్తిదేవతే సౌందర్యనిధి. విద్యా , ప్రతిపత్ కళ, ఔపయికి వంటి ఉపమానాలు కల సీతాదేవియే శ్రీమహాలక్ష్మి. హనుమంతుడు కుండలినీ యోగసాధకుడు, త్రిజటా స్వప్నవృత్తాంతం గాయత్రీ మంత్రం, రావణుడు కౌళమార్గ సాధకుడు,ఇవన్నీ ధ్వనిగర్భితాలనీ వాల్మీకి హృదయసంకేతాలనీ శేషేంద్ర ప్రతిపాదనలు. అపూర్వాలు.నానంతరాలు.
భారతం రామాయణానికి ప్రతిబింబం. మేఘ సందేశానికీ రామాయణంతో సంబంధం ఉంది. రామాయణంలో ఉన్నది ఇంద్ర పారమ్యమే. ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. రామాయణం భారతానికి పూర్వగ్రంథమే. శాకుంతలంలోని నాందీ శ్లోకం దేవీతత్త్వబోధకమే. ఇవన్నీ శేషేంద్ర ఆలోచనాజలధినుంచి పుట్టిన అమృతఫలాలు. వీటిని నిరూపించడానికి విశ్లేషణ నికషోపలంగా సాగుతుంది. అన్నీ చెప్పడం సాధ్యం కాదుగానీ ఒక్క ఉదాహరణ చెప్తాను. అది రావణుడు కౌళమార్గయాయి అని నిరూపించడం. వామాచార మార్గాలని మొత్తం అయుదు ఉన్నాయి. వాటిలో కౌళం ఒకటి. ఇది కౌలం’ నుంచి వచ్చి ఉంటుంది. కొన్ని కులాచారాలు ఇలా కౌళంగా పరిణమించి ఉంటాయి. ఇది పంచ మకారాలను ఆశ్రయించి చేసే తాంత్రిక సాధన. ఇందులో పశు, వీర, దివ్య భావాలు ఉంటాయి. పశు భావన దశలో ఇంద్రియ సుఖాలను విపరీతంగా అనుభవిస్తారు. మోక్షం పొందాలనే తపన జ్వలిస్తూ ఉండడమే దానికి కారణం. ఇది ఒకరకంగా వైరభక్తి లాంటిదన్నమాట. మద్యం, మగువలను ఉపయోగించిన తరువాత వీరోపాసన చేస్తారు. చివరిదైన దివ్యభావన చేరితే సాధకుడు గమ్యం చేరినట్లే. కాని, అలా చేరిన వారు అరుదు. సృష్టి, స్థితి, లయాలలో చివరిదైన సంహార క్రమానికి కౌలంలో ప్రాముఖ్యం ఉన్నదని ఒక వాదం ఉంది. కానీ తగిన ఆధారాలు లేవు. ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ అందులో నుంచి బయటపడటం కష్టసాధ్యం. కనుక చాలా మంది అందులోనే కూరుకుపోతారు. పశుభావన దశలో ఇంద్రియ సుఖాలను అనుభవించి బయట పడగలిగినవారు గురువు సహాయాన్ని పొంది, ‘‘సోహం’’ భావనతో దివ్య భావన దశ చేరుతారని కౌలాన్ని పాటించేవారి విశ్వాసం. పంచ మకారాలను వీరు సమర్థిస్తారు. మద్యం కుండలినీ సాధనలో సహస్ర దళ పద్మం నుంచి అంటే సహస్రారం నుంచి స్రవించే (సుధ) అమృతమే. మనస్సును అదుపు చేసి, వాక్ తదితర ఇంద్రియాలను నియంత్రించి, పాప, పుణ్యాలను జ్ఞాన ఖడ్గంతో ఛేదించడమే ‘‘మాంసం’’. మత్స్యం అంటే ఇడా పింగళ నాడుల మధ్య శ్వాసే. నిత్యం కదులుతూ ఉంటుంది. ముద్రా భక్షణం అంటే అటుకులు తినడం కాదు. కుండలినీ శక్తిని సహస్రారం చేర్చి, బలమైన కోర్కెలకు కళ్ళెం వేయడం. మైథునం అంటే స్త్రీ సంగమం కాదు. జీవాత్మ, పరమాత్మల కలయిక. ఇదే దివ్య భావన.
సంస్కృతి నాగరికతల సృష్టికర్తలయిన కవులే లేకపోతే సమాజానికీ అరణ్యానికీ తేడా ఉండేది కాదు. మానవుల ప్రధానప్రవృత్తి కళాకారుడో కవో కావడమే. మానవుడు భాషకంటే సమున్నతుడు. కానీ భాషే నేడు మనిషిని శాసిస్తోంది. అందుకే కవిది సమాజంలో సర్వోన్నతస్థానం అని శేషేంద్ర తీర్పు. వైజ్ఞానిక విశ్లేషణలలో సత్యదృష్టి, విలువల పరిరక్షణ, విచక్షణ, ధైర్యం శేషేంద్ర బలాలు. విశ్వం మొత్తం ఊహాత్మకం. సంకేతాత్మకం. దానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. వాటిని అర్థంచేసుకొంటే మన దృక్పథమూ, జీవితమూ మారిపోతాయి. గోళ, ఖండ, దేశ, జాతి లాంటి క్షుద్రబంధాలు తెగిపోతాయి. శారీరక పంజరం నుంచి ఆత్మకు విముక్తి. ఇది శేషేంద్ర తాత్త్వికజ్ఞానజ్యోతి. మానవ విలువల్ని మనం మతసైద్ధాంతిక కోణంనుంచి కాక వాటిని మానవవిధులుగా చూడాలి. ఇది శేషేంద్ర దార్శనికత.
'భారతరామాయణములను శర్మ చదివినట్లుగా చదివినవారి సంఖ్య లేదనియే చెప్పవలెను ' - అన్న విశ్వనాథవారి వాక్కులే శేషేంద్రకు శతకోటి జ్ఞానపీఠాలు. ఆధునిక మహాభారతం 2004 లో నోబుల్ బహుమతికి నామినేట్ అయిందని మనం సగర్వంగా చెప్పుకొంటున్నాం కానీ ఆ పురస్కారం దానికి రాకపోవడంలో ఒక సూచన కనిపిస్తోంది. భారతీయకావ్యాత్మను అర్థం చేసుకొనే స్థాయికి విశ్వసాహిత్యలోకం ఇంకా ఎదగాలేదనీ ఎదగాలనీ. అందుకే షోడశకళాపూర్ణుడు కావడంకోసం విశ్వమానవుణ్ణి ఈ షోడసిలోనికి ఆహ్వానిస్తూ..
డా. అద్దంకి శ్రీనివాస్,
కవి , విమర్శకులు
uofsa.edu/team/addanki-srinivas-ph-d/
draddanki@gmail.com
9848881838